లాంగ్ పెండింగ్, మిస్సింగ్ కేసులు, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్పై ప్రత్యేక దృష్టి • రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ మోసాలపై విస్తృత అవగాహన కల్పించాలి • ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు
సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 11: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన జిల్లా పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సమర్థవంతంగా సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిజమైన దోషులకు శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దర్యాప్తులో సాంకేతిక లేదా న్యాయపరమైన సందేహాలు తలెత్తినప్పుడు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యత
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తూ మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంతో పాటు మహిళలకు సంబంధించిన చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి, అక్కడ ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
గ్రామస్థాయిలో సమాచార సేకరణ కీలకం
శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామస్థాయిలో సమాచార సేకరణ అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామ ప్రజలు, యువతతో సత్సంబంధాలు ఏర్పరచుకుని ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. గ్రామాల్లో రౌడీషీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ బంకులు తదితర కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభకు రివార్డులు
విధి నిర్వహణలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందిని గుర్తించి రివార్డులు, ప్రశంసాపత్రాల కోసం సిఫారసు చేయాలని ఎస్హెచ్ఓలకు సూచించారు.
పోలీస్ వాహనాల నిర్వహణపై సమీక్ష
అనంతరం అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ ఎస్హెచ్ఓలకు కేటాయించిన పోలీసు వాహనాల స్థితిగతులను పరిశీలించారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు. వాహనాల్లో అవసరమైన ఎమర్జెన్సీ కిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
వాహనాలను పరిశుభ్రంగా, మంచి స్థితిలో నిర్వహిస్తున్న డ్రైవర్లను ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు.
ఈ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ప్రభాకర్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు సురేష్, రాజశేఖర్ రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
