నగరం పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
సమాచారం ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులు తమ వ్యాగన్-ఆర్ కారులో యాదగిరిగుట్టకు వెళ్లారు. ఉదయం స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భోనగిరి వద్ద ఒక రెస్టారెంట్లో భోజనం చేసి, అనంతరం బీబీనగర్ సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎండవేడికి అలసటతో నిద్రమత్తులో ఉండగా, అప్పటికే వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
