తెలంగాణలో పదో తరగతి (SSC-2026) ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ, ఆందోళన పెరుగుతున్న పరిస్థితుల్లో బాలానగర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలానగర్ సీఐ నర్సింహా రాజు విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు.
మార్కులు జీవితాన్ని నిర్ణయించవని, అవి కేవలం ఒక దశ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులను కోరారు. “ఫలితం ఏదైనా అది జీవితానికి ముగింపు కాదు, కొత్త విజయానికి మొదటి మెట్టు మాత్రమే” అని ఆయన ధైర్యం ఇచ్చారు.
తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చకూడదని సూచించారు. పిల్లలు మౌనంగా లేదా ఒంటరిగా ఉంటే వెంటనే వారితో మాట్లాడి మానసికంగా అండగా నిలవాలని తెలిపారు.
ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు లేదా తల్లిదండ్రులు వెంటనే 100 నంబర్కు కాల్ చేయాలని లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని సీఐ నర్సింహా రాజు భరోసా ఇచ్చారు.
