Breaking News

దేవరకొండ SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం బహిర్గతం – రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం, నలుగురు అరెస్ట్

News Content:
నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – ACB బ్రాంచ్‌లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు సహ నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం రూ.2,42,10,000 నగదు, 6 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఏప్రిల్ 13, 2026న బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌లో కాంట్రాక్ట్ హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి, బ్యాంక్‌లోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి, నాన్-బ్రాంచ్ KYC ప్రక్రియను అక్రమంగా ఉపయోగించి రూ.2,65,55,268 నగదును మోసపూరితంగా బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు క్రైమ్ నం.144/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు చక్రపాణి, సూర్యాపేట SBI బ్రాంచ్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు సహకారంతో ఈ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. MIS ద్వారా ఇనాక్టివ్ ఖాతాల వివరాలు సేకరించి, నకిలీ ఆధార్, PAN కార్డులు తయారు చేసి, ఖాతాల KYC వివరాలను మార్పులు చేసి, YONO యాప్ ద్వారా అక్రమంగా డబ్బులు బదిలీ చేశారు.

ఈ మోసంలో కేతవత్ రాంలాల్ మరియు మారేపల్లి శివ ఇతర వ్యక్తుల ఖాతాలను ఉపయోగించి నగదును మళ్లించే పనిలో సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మోసం చేసిన డబ్బును ముందుగా నిర్ణయించిన వాటాల ప్రకారం నిందితులు పంచుకున్నట్లు విచారణలో తేలింది.

పోక్సో, హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, జీవిత ఖైదు

ఈ ఘటన బయటపడటానికి కారణం, ఒక ఖాతాదారుడికి అక్రమ KYC అప్డేట్ పై ఈ-మెయిల్ అలర్ట్ రావడం. వెంటనే బ్యాంక్‌ను సంప్రదించడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశాయి. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *