మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు నమోదు చేయడం ఈ సేవ ప్రత్యేకత. దీంతో బాధితులు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తక్షణమే న్యాయం పొందే అవకాశం కలుగుతోంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 35 ఆన్సైట్ ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు వేగంగా న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.
మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, లైంగిక నేరాలు, ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు, ఆస్తి సంబంధిత నేరాలు, వృద్ధులపై నేరాలు, డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ వంటి ప్రత్యేక చట్టాల కింద కేసులు, అలాగే పోలీస్ స్టేషన్కు రాలేని ఇతర బాధితుల ఫిర్యాదులను ఈ విధానం ద్వారా నమోదు చేస్తున్నారు.
ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. బాధితుల వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.
బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు.
