సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి పోలీసులకు కీలక విజయం లభించింది. అంతర్ జిల్లా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై రూరల్ సి.ఐ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు.
తంగళ్ళపల్లి మండలం తాడూరి గ్రామానికి చెందిన సాసాల లక్ష్మి అనే మహిళ తన ఇంటికి తాళం వేసి తన కుమార్తె వద్దకు వెళ్లిన సమయంలో, మార్చి 30 తెల్లవారు జామున గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి ఆభరణాలు, రూ.3 వేల నగదును అపహరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, మండపెళ్లి గ్రామ శివారులో వారిని పట్టుకున్నారు. విచారణలో వారు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్గర్ పాషా (21), సనుగుల గ్రామానికి చెందిన పిట్టల అరవింద్ (20), వేములవాడ మండలం సుభాష్ నగర్కు చెందిన సామల బాలకిషన్ (20)గా గుర్తించారు. వారి వద్ద నుంచి దొంగిలించిన 2 తులాల బంగారు ఆభరణాలు మరియు 11 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ అజ్గర్ పాషాపై 21 కేసులు, పిట్టల అరవింద్పై 8 కేసులు, సామల బాలకిషన్పై 6 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.
కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మరియు పోలీస్ సిబ్బంది సంపత్, అరవింద్, శ్రీనివాస్లను సి.ఐ అభినందించారు.
