సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను మోసాల నుండి కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు వంటి కొత్త తరహా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు హుటాహుటిన తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం, బంగారంపై అప్పులు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
అటువంటి పరిస్థితుల్లో కస్టమర్ల ప్రవర్తనలో అసాధారణ మార్పులు గమనించినప్పుడు బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండి, అది సైబర్ ముఠాల మోసం కావచ్చని గుర్తించి వారిని హెచ్చరించాలి. ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు మోసగాళ్లకు బలికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సూచించారు.
ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, అత్యవసర సేవల నంబర్ 100 కు సమాచారం అందించాలని సూచించారు.
బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
