జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు.
ఈ కాలంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగం కూడా నిషేధించబడిందని తెలిపారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
