పదవీ విరమణ పొందిన ఏఆర్ఎస్ఐ ఆర్.కే. పూర్ణచందర్కు ఘన సన్మానం
మహబూబాబాద్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఏఆర్ఎస్ఐ ఆర్.కే. పూర్ణచందర్ను జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరించి, పోలీసు శాఖకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ అనేది ఒక సేవా అధ్యాయానికి ముగింపు మాత్రమేనని, జీవితానికి మాత్రం కొత్త ఆరంభమని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతకు మార్గనిర్దేశం చేయడం, తమ అనుభవాలను సమాజానికి ఉపయోగపడేలా పంచుకోవడం ద్వారా పదవీ విరమణ అనంతర జీవితం మరింత సార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురికాకుండా, సానుకూల దృక్పథంతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
పోలీసు శాఖలో ఎన్నో సంవత్సరాల పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలందించిన ఆర్.కే. పూర్ణచందర్ను ఎస్పీ అభినందిస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కూడిన పదవీ విరమణ జీవితం గడపాలని శుభాకాంక్షలు తెలిపారు.
