జిల్లా కేంద్రం: విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్ పలికి, కలిసి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆగస్టు-2026 స్వాతంత్ర్య మాసోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి భారీ సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
“అగు… ఆలోచించు… నిజం నిర్ధారించు… సైబర్ భద్రత పెంచు” అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు మరియు విద్యార్థులను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయడం, సురక్షిత డిజిటల్ వినియోగంపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, యూపీఐ పిన్లు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, అవగాహన ద్వారానే సైబర్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.
సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లు, ఉద్యోగ అవకాశాల సందేశాలు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ కాల్స్, లోన్ యాప్లు వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లు, ఫ్రెండ్ రిక్వెస్ట్లకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే, ముఖ్యంగా “గోల్డెన్ అవర్” (మొదటి గంట)లోనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ తెలిపారు.
“సురక్ష కా తిరంగా” ప్రచార సందేశమైన “అప్రమత్తంగా ఉండండి – అవగాహన పెంచుకోండి – సైబర్ సురక్షితంగా ఉండండి” అనే మూడు అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, నాగరాజు, జునైద్, సైబర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
