Breaking News

ప్రగతి కళాశాల పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ – కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు నిర్వహించనున్న పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

నేడు పట్టణ కేంద్రంలోని ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ సిబ్బంది డ్యూటీలను స్వయంగా పరిశీలించారు. పరీక్షల పారదర్శకతకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాల వద్ద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో గుంపులుగా తిరగడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తదితర అనధికార కార్యకలాపాలు నిర్వహించరాదని ఆదేశించారు. పరీక్ష సమయాల్లో సంబంధిత సెంటర్లను మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

సెల్‌ఫోన్ రికవరీలో జిల్లా పోలీసులకు విశేష విజయం – రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు యజమానులకు అందజేత

పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. విద్యార్థులు నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పరీక్షల కాలమంతా ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ పట్రోలింగ్, ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *