నల్గొండ: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే “సైబర్ జాగృతి దివస్” కార్యక్రమంలో భాగంగా “సురక్షా కా తిరంగా – Stay Alert, Stay Aware, Stay Cyber Safe” అనే ప్రత్యేక సందేశంతో నల్గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతా ఉండటంతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సాధారణ దొంగతనాల కంటే సైబర్ మోసాల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కారణంగా ప్రజలు వేల కోట్ల రూపాయలు కోల్పోయారని గుర్తు చేసిన ఎస్పీ, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామాల్లోని ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియా మోసాలు, నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్లు, కొరియర్ ఫ్రాడ్లు, లోన్ యాప్లు, క్యూ ఆర్ కోడ్ స్కామ్లు, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్లు, “డిజిటల్ అరెస్ట్” పేరుతో జరిగే మోసాలు వంటి అనేక రూపాల్లో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ నెల మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఎస్పీ, అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా, అధికారిక వెబ్సైట్, యాప్ నిజమైనదేనా, సంబంధిత ఆర్థిక నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే మోసగాళ్లను నమ్మవద్దని, ఏ ప్రభుత్వ ఉద్యోగమూ డబ్బులు తీసుకుని ఇవ్వబడదని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, ఉద్యోగాల పేరుతో వచ్చే సందేశాలు, లాటరీలు, గిఫ్ట్లు, క్యాష్బ్యాక్లు, ఆన్లైన్ లోన్లు, కస్టమర్ కేర్ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
“డిజిటల్ అరెస్ట్” పేరుతో వీడియో కాల్స్ చేసి, తాము పోలీసులు, సీబీఐ, ఈడీ లేదా కోర్టు అధికారులు అంటూ భయపెట్టే వారిని నమ్మవద్దని ఎస్పీ హెచ్చరించారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని స్పష్టం చేస్తూ, అలాంటి కాల్స్ వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. వేగంగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన ప్రతిజ్ఞ చేశారు. ప్రతి విద్యార్థి తన కుటుంబంలో, గ్రామంలో కనీసం పది మందికి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన అవగాహన వీడియోలను ప్రదర్శించగా, పోలీసు కళాబృందం సందేశాత్మక ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించింది. కార్యక్రమం ముగింపులో జిల్లా ఎస్పీ “సురక్షా కా తిరంగా” పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ 2 టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్బీ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, 2 టౌన్ ఎస్ఐ సైదా బాబు, వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
