మున్సిపల్ చైర్మన్ / వైస్ చైర్మన్ ఎన్నికల బందోబస్త్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ..
నల్లగొండ జిల్లాలో ప్రశాంతం వాతావరణంలో ముగిసిన మున్సిపల్ చైర్మెన్/వైస్ చైర్మన్ ల ఎన్నికల ప్రక్రియ …
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించిన మేయర్/డిప్యూటీ మేయర్,చైర్మన్/వైస్ చైర్మన్ ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ ప్రక్రియను కాపాడేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి దశలోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసి,అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

చట్టవిరుద్ధంగా గుంపులు గుమికూడడం, నినాదాలు చేయడం, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను పూర్తిగా నిషేధించి శాంతి భద్రతలను కాపాడినట్లు వివరించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా పరిస్థితులను సమీక్షిస్తూ ఎటువంటి శాంతి భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఈ ఎన్నికల ప్రక్రియలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
