Breaking News

కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే ట్రయల్ రన్: క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్

హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండో వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌ను V. C. Sajjanar స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ట్రాఫిక్ జాయింట్ సీపీ Joel Davis, డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణా రెడ్డి తదితర అధికారులతో కలిసి సీపీ కేబీఆర్ పార్కు మెయిన్ గేట్, Basavatarakam Indo American Cancer Hospital, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నెం.45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఉన్న ప్రధాన కూడళ్లను సందర్శించి ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రయల్ రన్ చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు. గతంలో ఏప్రిల్ 5న నిర్వహించిన తొలి ట్రయల్ రన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దిన తర్వాతే రెండో దశ ట్రయల్ చేపట్టినట్లు వెల్లడించారు.

ఆదివారం రాత్రి 8 గంటల వరకు మాత్రమే ట్రయల్ రన్ కొనసాగుతుందని, సోమవారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ట్రయల్ సమయంలో ఎదురయ్యే సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

కేబీఆర్ పార్కు పరిసరాల్లో భవిష్యత్తులో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు నిర్మించనున్నట్లు సీపీ వెల్లడించారు. కొత్త వన్‌వే విధానం వల్ల ప్రయాణ దూరం కొంత పెరిగినా, ట్రాఫిక్ జామ్‌లు తగ్గి ప్రయాణం మరింత సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. వాహనదారులు అకస్మాత్తుగా లేన్లు మార్చకుండా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే సూచనలు, అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

న్యాయవాదుల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలి: ఐలు భారీ ధర్నా

అలాగే పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, మార్గంలోని ఆసుపత్రులతో సమన్వయం కొనసాగుతోందని చెప్పారు. అంబులెన్సుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ మాట్లాడుతూ, ట్రయల్ రన్ సమయంలో లేన్ మార్పుల వద్ద కొన్ని సవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. శాశ్వత అమలు సమయంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెక్‌పోస్టు–కేబీఆర్ పార్కు మధ్య 150 మీటర్ల ఇంటర్‌చేంజ్ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాదచారుల భద్రత కోసం చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు వద్ద పెడెస్ట్రియన్ సిగ్నళ్ల ఏర్పాటు అంశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాతే శాశ్వత మార్పులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నగర అభివృద్ధి, సాఫీ ప్రయాణం కోసం ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *