జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పదోన్నతి పొందిన సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్ పట్టీలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, బాధ్యతలు కూడా మరింత పెరిగినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం, సేవా తత్పరతను అదే స్థాయిలో కొనసాగిస్తూ కొత్త హోదాలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రతి పోలీసు ఉద్యోగి పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ అన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవాభావంతో పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని పదోన్నతి పొందిన సిబ్బందికి సూచించారు.
తమ పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, సహచరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించిన ఎస్పీ, పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన వారిని అభినందించారు.
