ధర్మపూర్: మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్మపూర్ గ్రామ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రుద్ర అనే పోలీసు జాగిలం సహాయంతో గ్రామంలోని పలు హోటళ్లు, షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని, ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో ఆర్ఐ కృష్ణయ్య, ఆర్ఎస్ఐ రమేష్, డాగ్ హ్యాండ్లర్ శంకర్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
