సిరిసిల్ల, జూన్ 18: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ Mahesh B. Githe తెలిపారు.
జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ పోక్సో కేసులో, మైనర్ బాలికను తండ్రి లైంగిక వేధింపులకు గురిచేయడంతో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో పాటు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు సిబ్బంది ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడి నేరం రుజువైందని నిర్ధారించి 4 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరం చేసిన వారు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పోలీసు, ప్రాసిక్యూషన్ విభాగాల సమన్వయంతో న్యాయపరమైన విచారణను పకడ్బందీగా నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేసు దర్యాప్తు, కోర్టు విచారణలో సమర్థవంతంగా పనిచేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
