వికారాబాద్, జూన్ 16: వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్నేహ మెహ్ర, మంగళవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ రూమ్లతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కీలక రికార్డులు, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల నిర్వహణ, వివిధ కేసుల ఫైళ్లను తనిఖీ చేసి పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ప్రజలతో సిబ్బంది ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, బాధితుల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలని, వికారాబాద్ పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల నిఘాను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విధి నిర్వహణతో పాటు పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే పనితీరు మరింత మెరుగవుతుందని తెలిపారు.
ప్రజలకు పోలీసు శాఖపై మరింత విశ్వాసం కలిగేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ స్నేహ మెహ్ర ఈ సందర్భంగా సూచించారు.
