ఈ నెల 05 వ తేది నుండి 22 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని మరియు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలలో 6995 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని అన్నారు. పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దుని అన్నారు. పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు,వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు.