వికారాబాద్: వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) స్నేహ మెహ్రా, యాలాల పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజా సేవల అమలు తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ ఆవరణ, పరిసర ప్రాంతాల పరిశుభ్రతను పరిశీలించడంతో పాటు వివిధ రిజిస్టర్లు, అధికారిక రికార్డులను నిశితంగా తనిఖీ చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల వివరాలు, నమోదైన కేసుల పురోగతి, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
జిల్లా ప్రజలకు పారదర్శకమైన, సత్వర స్పందనతో కూడిన పోలీసు సేవలు అందించడమే శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. చట్ట అమలులో నిష్పాక్షికతను పాటిస్తూ, బాధితులకు సేవలందించడంలో పూర్తి పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహార శైలిని అనుసరించాలని అధికారులను ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు లేదా ఫైళ్లు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు దర్యాప్తును పూర్తి చేసి, సంబంధిత వివరాలను సీసీటీఎన్ఎస్ (CCTNS) ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు.
అదేవిధంగా, ఇటీవల జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన ‘సురక్ష మిత్ర’ మరియు ‘నిఘా నేత్రం’ కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ యాదయ్య, యాలాల ఎస్ఐ విట్టల్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
