దేవరకొండ, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సీఐ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రేవ్ కేసుల క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ఇతర దర్యాప్తు సంబంధిత పత్రాలను సవివరంగా పరిశీలించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం హత్యలు, దోపిడీలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన ఛేదించడంతో పాటు, ప్రతి కేసులో పటిష్టమైన ఆధారాలు సేకరించి నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సీసీటీఎన్ఎస్ నమోదు విధానం, డిజిటల్ రికార్డుల నిర్వహణ, కోర్టు డిస్పోజల్ కేసుల ఫాలోఅప్, వారెంట్ల అమలు వంటి అంశాలపై కూడా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎస్పీ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డితో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
