హైదరాబాద్ నగర పరిధిలో వరుస ఆటో రిక్షాలు, వాహనాల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, పహాడీషరీఫ్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన మూడు ప్యాసింజర్ ఆటోలు, తొమ్మిది వాహనాల బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ K. Srinivasa Rao తెలిపారు.
అరెస్టైన వారిలో మహమ్మద్ అక్బర్, ఫైజుల్లా ఖాన్ అలియాస్ ఫైజ్ ఉండగా, మరో నిందితుడు మహమ్మద్ హమీదుద్దీన్ అలియాస్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. వీరంతా హైదరాబాద్కు చెందిన పాత నేరస్థులని, చంచల్గూడ జైలులో పరిచయం ఏర్పడిన తర్వాత కలిసి దొంగతనాలకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, జైలు నుంచి విడుదలైన అనంతరం జడ్చర్ల, మహబూబ్నగర్ టౌన్, రూరల్ ప్రాంతాల నుంచి మూడు ఆటోలను దొంగిలించిన నిందితులు, వాటినే ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, డీసీఎం వాహనాల్లోని బ్యాటరీలను చోరీ చేసేవారు. మేడ్చల్, తుక్కుగూడ, మహేశ్వరం ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.
నమ్మదగిన సమాచారంతో శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం, పహాడీషరీఫ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి మూడు బజాజ్ ప్యాసింజర్ ఆటోలు, తొమ్మిది వాహనాల బ్యాటరీలను రికవరీ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
విచారణలో మహమ్మద్ అక్బర్పై గతంలో మూడు కేసులు, ఫైజుల్లా ఖాన్పై 15 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి, పహాడీషరీఫ్ డీఐ దెబోరా, ఎస్ఐలు నాగరాజు, శేషు తదితర సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
