జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ Mahesh B. Githe ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 15 ప్రత్యేక పోలీసు బృందాలు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో అక్రమంగా అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ ప్రజలను వేధిస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులపై 6 కేసులు నమోదు చేశారు.
తనిఖీల్లో భాగంగా రూ.1,39,65,000 విలువైన వివిధ డాక్యుమెంట్లు, అలాగే రూ.1,77,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించడం, సామాన్య ప్రజలపై అధిక వడ్డీల భారం మోపడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వేధించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాత్కాలిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి తర్వాత చెల్లించలేక కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ అనుమతులతో చట్టబద్ధంగా ఫైనాన్స్ నిర్వహించే సంస్థలను మాత్రమే నమ్మాలని, అక్రమ ఫైనాన్స్ దందాలపై సమాచారం ఉంటే జిల్లా పోలీస్ కార్యాలయం లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
