మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు రూరల్ సీఐ అంజలి నాయకత్వంలో బజానా తండా గ్రామంలో విస్తృత స్థాయిలో “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం” నిర్వహించారు. తెల్లవారుజామున 5:20 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని సుమారు 120 ఇండ్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలను గుర్తించారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 100 కిలోల నల్ల బెల్లం, 20 లీటర్ల గుడుంబా, 20 కిలోల పట్టిక, 16 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు సంబంధించి బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీల అనంతరం గ్రామస్తులతో సమావేశమై దొంగతనాలు, ఇంటి చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం, చెరువుల్లో ఈత వల్ల జరిగే ప్రమాదాలు, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు మరియు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, గంజాయి విక్రయాలు, గుడుంబా తయారీ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఫోర్స్, క్యూ ఆర్ టీ ఫోర్స్, ఏఆర్ మహిళా పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 40 మంది పోలీసులు పాల్గొన్నారు.
