రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మే 22, 23 తేదీల్లో చేపట్టిన రెండు రోజుల స్పెషల్ డ్రైవ్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ మొత్తం 438 మంది డ్రైవర్లు పట్టుబడ్డారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
పట్టుబడిన వారిలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ఉన్నారు. మొత్తం 365 మంది టూ వీలర్ డ్రైవర్లు, 25 మంది త్రిచక్ర వాహనదారులు, 47 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు మరియు ఒకరు ఇతర వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
తనిఖీల్లో భాగంగా నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో 98 మందికి 30-50 mg మధ్య, 191 మందికి 51-100 mg మధ్య, 83 మందికి 101-150 mg మధ్య BAC స్థాయిలు నమోదయ్యాయి. అలాగే 42 మందికి 151-200 mg, 13 మందికి 201-250 mg, 6 మందికి 251-300 mg మరియు 5 మందికి 300 mg కంటే ఎక్కువ ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
“మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి” అని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.
