జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన హోమ్ గార్డ్ దేవయ్య కుటుంబ సభ్యులకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా అందజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవయ్యకు యాక్సిస్ బ్యాంక్లో సాలరీ అకౌంట్ ఉండటంతో యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కింద రూ.30 లక్షల బీమా మంజూరైంది. ఈ చెక్ను యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం ఈరోజు దేవయ్య కుటుంబ సభ్యులకు అందించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన హోమ్ గార్డ్ దేవయ్య మృతి పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. దేవయ్య కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డులు విధులు నిర్వహించే సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, ఆర్ఐ రమేష్, యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం, దేవయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
