వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో చాలామంది తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా భద్రతా చర్యలు పాటించాలని జిల్లా పోలీసులు సూచించారు. ఇంట్లో బంగారం, వెండి నగలు, విలువైన వస్తువులు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం మంచిదని తెలిపారు. అలాగే పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలని సూచించారు.
ద్విచక్ర వాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట నిలపరాదని పేర్కొన్నారు. బయట పార్క్ చేసే వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా వేయాలని సూచించారు.
ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రత పెరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాలను ఇంటర్నెట్కు అనుసంధానం చేస్తే మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా ఇంటిని పర్యవేక్షించవచ్చని వివరించారు.
ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు పోలీసులకు సహకరించాలని, సమీప పోలీస్ స్టేషన్ అధికారులు మరియు ఇతర అత్యవసర నంబర్లను సెల్ఫోన్లో సేవ్ చేసుకోవాలని సూచించారు.
అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల గురించి వెంటనే డయల్ 100 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739కు సమాచారం ఇవ్వాలని కోరారు.
సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఇంటి లొకేషన్, ప్రయాణ తేదీల వివరాలను సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్కు తెలియజేస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేస్తామని తెలిపారు.
దొంగతనం జరిగినట్లు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత పోలీసులకు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్కు పూర్తి వివరాలతో సమాచారం అందించాలని జిల్లా పోలీసులు సూచించారు.
