జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమం
ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టడం, బాధితులకు వేగంగా న్యాయం అందించడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ దర్యాప్తు అధికారులకు, సైబర్ వారియర్స్కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒకరోజు శిక్షణలో జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల దర్యాప్తు అధికారులు (IOలు), సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా CCTNS (Crime and Criminal Tracking Network & Systems), NCRP (National Cyber Crime Reporting Portal), SAMANVAY, SAHYOG, NATGRID వంటి కీలక డిజిటల్ ప్లాట్ఫారమ్ల వినియోగంపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే GRM (Grievance Redressal Mechanism), MRM (Money Restoration Mechanism) మాడ్యూళ్ల ద్వారా ఫిర్యాదుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల పర్యవేక్షణ, సైబర్ మోసాల్లో కోల్పోయిన నగదును బాధితులకు తిరిగి అందించే ప్రక్రియపై వివరించారు.
అదనంగా సైబర్ నేరాల ఫిర్యాదుల నమోదు, డిజిటల్ ఆధారాల గుర్తింపు, భద్రపరచడం, బ్యాంకింగ్, ఆర్థిక మోసాల దర్యాప్తు, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, కేంద్ర, రాష్ట్ర స్థాయి సంస్థలతో సమన్వయం, వివిధ పోర్టల్స్ ద్వారా సమాచార సేకరణ, నిందితులను వేగంగా గుర్తించే పద్ధతులు, కేసుల త్వరితగతిన పరిష్కారానికి అనుసరించాల్సిన విధివిధానాలపై నిపుణులు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్త రూపాలు దాలుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు దర్యాప్తు అధికారుల నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు సైబర్ నేరాల దర్యాప్తులో వేగం, పారదర్శకత, సమర్థతను పెంచుతాయని తెలిపారు.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం, సైబర్ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఈ శిక్షణ కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల దర్యాప్తు అధికారులు, సైబర్ వారియర్స్ చురుకుగా పాల్గొని, నిపుణులను ప్రశ్నిస్తూ ప్రాయోగిక అవగాహన పొందారు.
