సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్, దారుణ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.
బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం. ముత్తు యాదవ్, సనత్నగర్ ఎస్హెచ్ఓ డి. అశోక్, ఎస్ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎన్. శేఖర్లను సీపీ సజ్జనర్ సత్కరించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ అలియాస్ ఫిజాకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా III అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కమ్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అలాగే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన రెండో నిందితుడు మహమ్మద్ రఫీక్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో 2023 ఏప్రిల్ 20న ఎనిమిదేళ్ల అబ్దుల్ వాహిద్ ఖాన్ను ఇమ్రాన్ అలీ ఖాన్ కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రి వసీం ఖాన్ తనకు ఇవ్వాల్సిన లక్ష రూపాయలు తిరిగి చెల్లించడం లేదనే కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం బాలుడిని తన నివాసంలో గొంతు నులిమి హత్య చేసి, మహమ్మద్ రఫీక్ సహాయంతో మృతదేహాన్ని బకెట్లో పెట్టి సమీప నాలాలో పడేశాడు.
బాలుడు కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయడంతో సనత్నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుల కదలికలు బయటపడ్డాయి. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు కోర్టులో బలంగా నిలవడంతో ప్రధాన నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, కిడ్నాప్ కేసులో యావజ్జీవ శిక్ష, సాక్ష్యాధారాల ధ్వంసం కేసులో మరో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సమాజం తలదించుకునేలా బాలుడిని హత్య చేసిన నిందితులకు ఈ తీర్పు గుణపాఠంగా నిలుస్తుందని అన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన “ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్” ఈ కేసులో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. డీసీపీ క్రైమ్స్ ఎస్. చైతన్యకుమార్, ఓఎస్డీ మల్లారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక కేసుల దర్యాప్తు సమర్థవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేశారని కొనియాడారు.
