సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హాజరై భరోసా సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో వర్మ కమిటీ సిఫార్సులు, నిర్భయ ఘటన అనంతరం పోక్సో, అత్యాచార బాధిత మహిళలకు అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో 2016 మే 7న తెలంగాణలో తొలి భరోసా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
గత 10 ఏళ్లుగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. ఫిర్యాదు నమోదు నుంచి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు మెడికో-లీగల్ సేవలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పరిహారం వంటి అన్ని సేవలను ఒకే చోట అందిస్తూ తెలంగాణ భరోసా సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ప్రస్తుత ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ చారుసిన్హా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన భరోసా సిబ్బంది బాధిత మహిళలకు ధైర్యం నింపుతూ, మెడికల్, లీగల్, కౌన్సెలింగ్, కాంపెన్సేషన్ సేవలను అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా పనిచేస్తున్నారని కొనియాడారు.
అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార కేసుల బాధితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, చిన్న సమాచారం అందిన వెంటనే భరోసా సిబ్బంది బాధితుల వద్దకు చేరుకుని అన్ని రకాల సహాయం అందిస్తారని తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా భరోసా సేవల కింద ఇప్పటివరకు 688 పోక్సో కేసులు, 85 అత్యాచార కేసులు, 162 కిడ్నాప్ కేసులతో కలిపి మొత్తం 935 కేసులకు సేవలు అందించారు. 175 అవగాహన కార్యక్రమాలు, 249 హోమ్ విజిట్స్, 531 వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ ద్వారా 24 మందికి రూ.6.40 లక్షలు అందజేయగా, 468 మంది బాధితులకు మొత్తం రూ.1.83 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పూలబాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
