సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భోయిగూడ రోడ్డులో ఉన్న జేపీ లిక్కర్ వైన్స్పై సికింద్రాబాద్ డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ తనిఖీల్లో లైసెన్సింగ్ నిబంధనల ఉల్లంఘనలు, బహిరంగంగా మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.
వైన్ షాపు పరిసరాల్లోని రహదారిపై పెద్ద సంఖ్యలో వ్యక్తులు మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు డిసిపి గుర్తించారు. దీంతో బహిరంగంగా మద్యం సేవించిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు.
అదేవిధంగా, వైన్ షాపు యాజమాన్యాన్ని కూడా డిసిపి తీవ్రంగా మందలించారు. షాపు పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగకుండా చూడాలని, ఎక్సైజ్ నిబంధనలు మరియు లైసెన్స్ షరతులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పబ్లిక్ న్యూసెన్స్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలని చిలకలగూడ ఎస్హెచ్వోకు డిసిపి ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీల్లో చిలకలగూడ ఏసిపి కె. శశాంక్ రెడ్డి, ఎస్హెచ్వో వి. రామకృష్ణ, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
