సంగారెడ్డి: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, 1934 ఆగస్టు 6న జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం, సమాన అభివృద్ధి కోసం అంకితం చేశారని అన్నారు. ఆయన కేవలం విద్యావేత్త మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, గొప్ప ఆలోచనాపరుడిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
తెలంగాణ సమస్యలను చారిత్రక, ఆర్థిక, సామాజిక కోణాల్లో విశ్లేషించి, ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకువచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఉద్యమం ద్వేషానికి కాకుండా ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
జయశంకర్ సార్ బోధించిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవ వంటి ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలని, సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని, జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలతో కలిసి శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మావతి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ డానియెల్తో పాటు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
