మహబూబ్నగర్లో పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపు యజమానులను స్టేషన్కు పిలిపించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్ షాపుల నిర్వహణపై పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
షాపుల్లో గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలు లేదా ఇతర నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయాల్లోనే షాపులను తెరవాలని, అర్ధరాత్రి వరకు షాపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులు నడపడం పూర్తిగా నిషేధమని తెలిపారు.
18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు టొబాకో ఉత్పత్తులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
