నల్లగొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టపరంగా ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎస్పీ ఆదేశాల మేరకు నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్డివిజన్ల పరిధిలో బజరంగ్ దళ్, గోసంరక్షణ సమితి, బీజేపీ యువమోర్చా సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల రవాణాకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసులు చేపడుతున్న చర్యలను వివరించారు.
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి, రాత్రింబగళ్లు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నామని చెప్పారు.
పశువుల అక్రమ రవాణా చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ఇది మూగజీవాలపై క్రూరత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువుల రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై Prevention of Cruelty to Animals Act, Cow Slaughter Act, భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల కింద కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికీ వెనుకాడమని తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలకు సూచించారు. పశువుల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు.
జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు సామాజిక సామరస్యాన్ని నిలబెట్టేందుకు, మూగజీవాల రక్షణ కోసం నల్లగొండ పోలీసులు నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గోసంరక్షణ సమితి, బజరంగ్ దళ్, బీజేపీ యువమోర్చా సభ్యులు పాల్గొన్నారు.
