హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంతో పాటు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టే దిశగా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో V C Sajjanar అధ్యక్షతన టీజీఐసీసీసీలో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ, హెచ్ఎండీఏ, ఎన్హెచ్ఏఐ, జీహెచ్ఎంసీ, ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొని రోడ్డు భద్రతపై సుదీర్ఘంగా చర్చించారు.
రోజుకు సగటున 2.80 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్న ఓఆర్ఆర్పై భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ సూచించారు. ప్రస్తుతం రోజుకు ఐదారు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, సమన్వయంతో పనిచేసి వీటిని సున్నాకు తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు మాత్రమే కాకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఓఆర్ఆర్లోకి ప్రవేశించే వాహనదారులకు మొబైల్ సందేశాల ద్వారా భద్రతా సూచనలు పంపాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్రాఫిక్ మార్షల్స్ సేవలను వినియోగించాలని సూచించారు. బ్రేక్డౌన్ తప్ప ఇతర కారణాలతో వాహనాలను ఓఆర్ఆర్పై నిలపరాదని, తప్పనిసరిగా ఆపాల్సి వస్తే హెల్ప్లైన్కు సమాచారం ఇచ్చి ఎడమ చివరి లేన్లో మాత్రమే నిలపాలని స్పష్టం చేశారు.
గత నాలుగు నెలల గణాంకాల ప్రకారం 33 శాతం ప్రమాదాలు నిద్రమత్తు వల్ల, 25 శాతం నిర్లక్ష్య డ్రైవింగ్, 15 శాతం అతివేగం, 14 శాతం టైర్లు పేలడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారుల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ, వాహనాల ఫిట్నెస్ మరియు టైర్ల నాణ్యత తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్పై ప్రతి నెలా రోడ్డు భద్రత సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ సమావేశంలో పోలీస్, రవాణా, మౌలిక వసతుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
