నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఎస్పీకి తెలియజేశారు. మొత్తం దాదాపు 40 మంది బాధితులు పాల్గొని వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విని, వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు వేగంగా న్యాయం అందేలా, ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
