Breaking News

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభం

హైదరాబాద్: తుకుగూడ ఫ్యాబ్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక ప్రధాన కార్యాలయ భవనాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి అనుగుణంగా ఆధునిక పోలీసింగ్ వ్యవస్థను అందించేందుకు ఈ కమిషనరేట్ కీలకంగా మారనుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ శివధర్ రెడ్డి, భవనాన్ని ప్రారంభించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, జాయింట్ కమిషనర్ చందనా దీప్తి, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ, షాద్‌నగర్ డీసీపీ సిరీష, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, అదనపు డీసీపీ బి.వి. సత్యనారాయణ, ఏసీపీ హుస్సేన్ నాయుడు, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు, మహేశ్వరం ఏసీపీ ఎస్. జనకి రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్‌క్వార్టర్స్ ఆర్‌ఐలు మరియు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కమిషనర్ జి. సుధీర్ బాబు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి తాత్కాలికంగా ఈ భవనాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

ఈ భవనం సెంట్రల్ లొకేషన్‌లో ఉండటంతో ప్రజలకు సులభంగా చేరుకునే వీలుంటుందని చెప్పారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్‌కు ఆనుకుని సర్వీస్ రోడ్డుపై ఉండటంతో రవాణా సౌకర్యం పరంగా కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురు మృతి

అలాగే మీర్ ఖాన్‌పేట్ ప్రాంతంలో కమిషనరేట్ శాశ్వత ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 24 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. నూతన భవన నిర్మాణానికి ప్రాథమికంగా రూ.25 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అన్ని కార్యకలాపాలను అక్కడికి తరలించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన పరిపాలనా, నిఘా, చట్టసంరక్షణ, ట్రాఫిక్ మరియు ప్రజా సేవలన్నీ ఈ తాత్కాలిక కార్యాలయం నుంచే నిర్వహించబడతాయని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాస కాలనీలు పెరుగనున్న దృష్ట్యా భద్రతా పరంగా ఈ కమిషనరేట్ కీలక పాత్ర పోషించనుంది.

కార్యక్రమం అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కమిషనరేట్ పరిధిలో సాంకేతిక ఆధారిత పోలీసింగ్, వేగవంతమైన స్పందన వ్యవస్థ, మహిళా భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *