Sangareddy District Police పరిధిలో ఎండాకాలంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాల దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అగ్ని ప్రమాదాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. రైతులు తమ పొలాల వద్ద ముందస్తుగా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎండిన గడ్డి దగ్గర మంటలు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల వద్ద వంటలు చేసిన తర్వాత పొయ్యిని పూర్తిగా ఆర్పకపోతే గాలికి మళ్లీ మంటలు చెలరేగే ప్రమాదం ఉందని తెలిపారు.
వేసవిలో గ్రామాల్లో ప్రజలు రాత్రి వేళల్లో ఇళ్ల బయట లేదా మేడలపై నిద్రించే పరిస్థితుల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని తెలిపారు. యువత మరియు చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. మద్యం సేవించి నీటిలోకి దిగడం ప్రమాదకరమని, నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారి తీస్తుందని స్పష్టం చేశారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే 100 లేదా 112 నంబర్లకు, లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. గత వేసవికాలంలో జిల్లాలో 7 అగ్ని ప్రమాదాలు, 50 దొంగతనాలు, 23 నీటి ప్రమాదాలు నమోదైనట్లు తెలిపారు.
