మహబూబాబాద్ జిల్లా మడిపెల్లి గ్రామంలో ఈరోజు “Arrive Alive – మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరిష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమం ప్రారంభంలో మడిపెల్లి గ్రామంలో సుమారు 200 మంది గ్రామ ప్రజలతో కలిసి జిల్లా ఎస్పీ హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా రోడ్డు భద్రతపై గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. గ్రామ భద్రతను పెంపొందించడంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక సర్పంచ్ రామలింగం మరియు దాతలను జిల్లా ఎస్పీ అభినందించారు.
తదుపరి నిర్వహించిన సభలో జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపీఎస్ గ్రామ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ సాధనమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడంలో హెల్మెట్ వినియోగం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
అలాగే గ్రామాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం సమాజాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి వినియోగం లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందించిన వారికి ₹5000 నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం అందించిన వారి గోప్యతను పూర్తిగా కాపాడుతామని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ మడిపెల్లి గ్రామాన్ని సురక్షిత, ఆరోగ్యకర, మత్తుమందుల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరం అన్నారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందిని ఈ సందర్బంగా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అభినందించారు.
