సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం (డిపిఓ)లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించిన ఇ. కళ్యాణి హైదరాబాద్ సిటీ కమిషనరేట్కు బదిలీపై వెళ్తుండగా, ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజమని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా కళ్యాణి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. ముఖ్యంగా కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు తొలి నెలలోనే వేతనం అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
ప్రతి పనిని సవాలుగా స్వీకరించి, సమయానికి పూర్తి చేసే నైపుణ్యం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో కూడా ఇదే విధంగా సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. జిల్లాకు అందించిన సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందజేశారు.
కళ్యాణి మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల్లో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి డిపిఓ సిబ్బంది సహకారం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. సిబ్బంది చూపిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. అందరూ తమ విధులను ఇదే విధంగా కొనసాగిస్తూ సేవలో ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, లాలూ నాయక్, నాగేశ్వర్ రావు, సూపరింటెండెంట్లు అశోక్, మోహనప్పతో పాటు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.
