తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ సూర్యాపేట సబ్ జైలును సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణలోని పలు కీలక అంశాలను పరిశీలించారు.
జైలులో ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, వసతి సౌకర్యాలను సమీక్షించిన డీజీ, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. జైలులో అందిస్తున్న సదుపాయాలపై ఖైదీల నుంచి స్పందన సేకరించారు.
ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ఖైదీలకు సరైన సంరక్షణ, భద్రత కల్పించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. అలాగే వారి పునరావాసం, మార్పు కోసం సమర్థవంతమైన సంస్కరణ చర్యలు అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో కారాగార శాఖకు చెందిన డీఐజీ ప్రిజన్స్ డా. డి. శ్రీనివాస్, డీఎస్జేఓ ఆర్. శోభన్ బాబు, సూపరింటెండెంట్ బి. సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
