సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, టోర్నమెంట్ మొత్తం హోరాహోరీగా సాగిందని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో పాటు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు. పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసం పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
గెలుపు-ఓటములు సహజమని, విజేతలు రాష్ట్ర స్థాయిలో మరింత ప్రతిభ కనబరచాలని, ఓడిన వారు ఈ అనుభవాన్ని పాఠంగా తీసుకుని మరింత కృషి చేయాలని ఎస్పీ సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి క్రీడా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, ఎస్.హెచ్.ఓలు క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆదేశించారు.
టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. విజేతలకు మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, ఎన్-9 బ్యాడ్మింటన్ కోర్ట్ యజమాని నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
