జిల్లా, ఏప్రిల్ 02: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” కింద రూ.25,000 నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు.
అయితే కొంతమంది పోలీస్ కేసులు ఉంటాయనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని, ఆ భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు.
ఈ పథకం ప్రకారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి రూ.25 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వాలని, సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు.
