మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరు
నకిరేకల్, జూన్ 12: నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం తాళ్లకుంట గ్రామంలో భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం రేపు (జూన్ 13, 2026) ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు తెలిపారు.
శుక్రవారం తాళ్లకుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు మరియు మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.
అలాగే ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అతిథిగా, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ వాదులు, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, తాళ్లకుంట గ్రామ శాఖ అధ్యక్షుడు పట్టేటి సైదులు, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు దోసలి సైదులు, పట్టేటి వెంకన్న, నాయకులు పోతరాజు ఆనంద్, రాగి నరసింహ, పట్టేటి చంద్రయ్య, రాగి నరేష్, పట్టేటి రాజశేఖర్, మహిళా నాయకురాళ్లు అన్లపూరి లక్ష్మీ, అన్లపూరి పార్వతి తదితరులు పాల్గొన్నారు.


