చందుర్తి సర్కిల్ పరిధిలో వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి బంగారు పుస్తెలు, వెండి కళ్ళు, రూ.2,000 నగదు, కార్ జాకీ, స్పీకర్లను స్వాధీనం చేసుకున్నట్లు చందుర్తి సీఐ రవీందర్ వెల్లడించారు.
అరెస్టయిన నిందితుడు కొనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మోకినపల్లి బాబు(36)గా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సుద్దాల ఎల్లమ్మ దేవాలయం, కొలనూరు ఎల్లమ్మ దేవాలయం, నిజామాబాద్ పెద్దమ్మ దేవాలయం, కొండాపూర్ పెద్దమ్మ దేవాలయం, భూక్యారెడ్డి తండా జగదాంబ దేవాలయం, రామన్నపేట దాసాంజనేయ దేవాలయం, రుద్రంగి మండలం మడేలయ్య దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
దొంగిలించిన సొత్తును వేములవాడలో విక్రయించేందుకు వెళ్తుండగా పల్లిమక్త గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సుద్దాల ఎల్లమ్మ దేవాలయంలో దొంగిలించిన రెండు స్పీకర్లు, కార్ జాకీ, బంగారు పుస్తెలు, రూ.2,000 నగదు, నిజామాబాద్ పెద్దమ్మ దేవాలయంలో దొంగిలించిన వెండి కళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై చందుర్తి సర్కిల్ పరిధిలో మొత్తం ఏడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన కొనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి, కానిస్టేబుళ్లు విశాల్, జగన్, నాగరాజులను సీఐ అభినందించారు.

