మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి శబరిష్ ఆదేశాల మేరకు కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యగారి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని) కింద పనిచేస్తున్న మహిళా, పురుష కార్మికులు మరియు గ్రామ ప్రజలకు మహబూబాబాద్ షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షీ టీం ఎస్సై కుమారి సునంద మాట్లాడుతూ మహిళల భద్రత, బహిరంగ ప్రదేశాలలో ఎదురయ్యే వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు. అలాగే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలు, OTP మోసాలు, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ వేధింపులపై ప్రజలను అప్రమత్తం చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన, సామాజిక సమస్యలను తెలియజేస్తూ వాటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల ఆరోగ్యపరమైన మరియు కుటుంబ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
ప్రజల కోసం మహబూబాబాద్ షీ టీం నెంబర్ 8712656935, అత్యవసర సేవల కోసం డయల్ 100/112, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930, మహిళ హెల్ప్ లైన్ 181/1091, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేష్ పాల్గొన్నారు.
