భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలకమని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా జనగణన స్వీయ గణన ప్రక్రియలో పాల్గొని కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలు ప్రభుత్వ గుర్తింపు కార్డులతో వచ్చే ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, నిజమైన వివరాలు నమోదు చేయాలని కోరారు.
అలాగే జనగణన పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారిక ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్, బ్యాంక్ ఖాతా, ఏటీఎం, ఓటీపీ లేదా పాస్వర్డ్ వివరాలు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింకులు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జనగణన విజయవంతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, సరైన సమాచారం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ఎం.డి ఉస్మాన్, మారోజు మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
