జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు.. 24×7 చెక్పోస్టులతో కట్టుదిట్టమైన భద్రత
బక్రీద్ పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా వివిధ కులాలు, మతాలకు చెందిన పెద్దలు, మత నాయకులు, ప్రజాప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించారు.
పండుగను పరస్పర సహకారం, సామరస్య వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారికి పోలీసులు సూచించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 24×7 చెక్పోస్టుల నిర్వహణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
పండుగ సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, అపోహలు వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ద్వారా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
