రైతులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ : జిల్లా ఎస్పీ డా. శబరీష్
మహబూబాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ధాన్యం రవాణా ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
గురువారం నెల్లికుదురు మండల పరిధిలోని ఆలేరు గ్రామంలోని మణికంఠ రైస్ ఇండస్ట్రీస్ (రైస్ మిల్), మునిగలవీడు, నెల్లికుదురు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్తో కలిసి జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న ధాన్యం, మక్కజొన్న కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్, రవాణా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ధాన్యం రవాణా సమయంలో అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు, నిల్వ ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించి రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, రవాణా శాఖలతో పాటు పోలీస్ శాఖ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే రైస్ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ పర్యటనలో డీఎస్పీ తిరుపతి రావు, సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
