హైదరాబాద్లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్ గౌడ్ వెల్లడించారు.
షాహాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 50/2018 కేసులో XVI అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, నాంపల్లి ఈరోజు తీర్పు ఇచ్చింది.
కేసు వివరాల ప్రకారం, 24-07-2018న పాతర్కీ దర్గా సమీపంలో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును నిందితుడు ముత్తు హరి కృష్ణ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షాహాలిబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు గొలుసు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి. నరసింహ సంజయ్ రెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించారు. వాదనలు విన్న గౌరవ 16వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జి. ప్రభాకర్ నిందితుడు ముత్తు హరి కృష్ణను దోషిగా నిర్ధారిస్తూ 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించారు.
సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని SHO అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఇన్స్పెక్టర్ పి. మహేష్ గౌడ్ సూచించారు.
